1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus in Kerala, Bangalore : Six and Four more test positive

కరోనా వైరస్ కేసులు : బెంగుళూరులో 4 - కేరళలో 6

Coronavirus
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 43 కేసులు ఉండగా, కొత్తగా మరో పది కేసులు నమోదయ్యాయి. వీటిలో బెంగుళూరులో నాలుగు, కేరళలో మరో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
బెంగళూరులో కొత్తగా 4 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్దారించామని, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 
 
కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు కర్ణాటక ప్రభుత్వం మీడియా బులెటిన్‌ను విడుదల చేస్తున్నది. కరోనా సమాచారంతోపాటు కరోనా వైరస్‌ బారిన పడిన వారి వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నది. 
 
అలాగే, కేరళ రాష్ట్రంలో మరో 6 కోవిద్‌-19(కరోనా వైరస్‌) కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధృవీకరించారు. బాధితులను ఐసోలేషన్‌ వార్డుల్లో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. దీంతో, సీఎం పినరయి విజయన్‌ కీలక ప్రకటన చేశారు. 
 
మార్చి 31 వరకు.. ఏడో తరగతి లోపు విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మిగితా క్లాసుల వారికి షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు జరుగుతాయని సీఎం వివరించారు. ట్యూషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, అంగన్వాడీలు, మదర్సాలు కూడా మార్చి 31 వరకు మూసివేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కరోనా వైరస్ గుప్పిట్లో ఇరాన్, భారతీయుల కోసం ప్రత్యేక ఫ్లైట్