శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (13:02 IST)

వారణాసి : శివలింగానికి కరోనా వైరస్ సోకుతుందనీ... మాస్క్ కట్టిన పూజారి!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న వారణాసిలో ఉన్న ఓ ఆలయంలో శివలింగానికి పూజారి మాస్క్ వేశారు. కరోనా వైరస్ కారణంగానే ఈ మాస్క్ వేసినట్టు పూజారి చెబుతున్నాడు. పైగా, శివలింగాన్ని ఎవరూ తాకొద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
తన చర్యపై ఆ పూజారి స్పందిస్తూ, దేవుడికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకే శివలింగానికి మాస్క్‌ వేశామని పూజారి కృష్ణ ఆనంద్‌ పాండే స్పష్టం చేశారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు కూడా మాస్క్‌లు ధరించి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటున్నారు. మొత్తంమీద పూజారి చేసిన పనికి భక్తులు కూడా ఒక్కసారి అవాక్కయ్యారు.