మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (09:58 IST)

3 కోట్లకు చేరిన పాజిటివ్ కేసులు... తెలంగాణాలో కరోనా విజృంభణ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మూడు కోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ వర్శిటీ వెల్లడించిన గణాంకాల మేరకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే రికార్డయ్యాయి. 
 
గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం గమనార్హం. కేసులు, మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉన్నది. ఆ దేశంలో 66,75,560 కేసులు నమోదుకాగా, 1,97,643 మంది మరణించారు. భారత్‌లో 52,14,677 కేసులు, 84,372 మరణాలు, బ్రెజిల్‌లో 44,55,386 కేసులు, 1,34,935 మరణాలు నమోదయ్యాయి.
 
ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడిన వారిలో 2,192 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,71,306 మంది కరోనా బారినపడగా 1,39,700 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,573 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు.
 
తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 1033 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 53,811 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 24,88,220 టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. 
 
తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.54శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 322 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.