బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (11:15 IST)

దేశంలో రూ.2 వేల నోటు మాయమైపోతోంది...?

దేశంలో చెలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు రూ.2 వేల నోటు. ఇటీవలి కాలంలో ఈ నోటు కంటికి కనిపించడం గగనంగా మారింది. అంటే.. చలామణిలో ఉన్న రూ.2 వేల నోటును కేంద్ర ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ పోతోంది. ఫలితంగా ఈ నోటు కంటికి కనిపించడం గగనంగా మారింది. 
 
2016లో దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోటును రద్దు చేసిన కేంద్రం ఆ తర్వాత కొత్తగా రూ.500 నోటుతో పాటు రూ.2 వేల నోటును తీసుకొచ్చింది. అప్పట్లో పాత నోట్ల రద్దు, కొత్తగా రూ.2 వేల నోటును విడుదల చేయడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా, కేంద్రం ఏమాత్రం వెనక్కితగ్గలేదు. 
 
ఆపై వరుసగా అన్ని రకాల నోట్లనూ మార్చిన కేంద్రం, వాటి ముద్రణను ప్రారంభించి, వరుసగా విడుదల చేస్తూ వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రూ.2 వేల నోట్లు అడపాదడపా మాత్రమే దర్శనమిస్తున్నాయి.
 
ఇప్పటికే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేశామని, గత రెండేళ్లుగా వాటిని ముద్రించడం లేదని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే. కాగా, 2019 సాధారణ ఎన్నికలకు ముందు రూ.2 వేల నోటుకు డిమాండ్ చాలా అధికంగా ఉండగా, ఆపై మాత్రం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 
 
ఇదేసమయంలో నోట్లు కూడా మాయం కావడం మొదలైంది. బ్యాంకులకు చేరిన నోట్లను తిరిగి ఖాతాదారులకు ఇవ్వడం కూడా తగ్గింది. మరోవైపు పెద్ద నోటును బడాబాబులు బ్లాక్ మనీ కింద వెనకేసుకుని వచ్చారని కూడా ఆరోపణలు వచ్చాయి.
 
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడిస్తున్న లెక్కల ప్రకార 2019 మార్చి నుంచి 2020 మార్చి మధ్యకాలంలో చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 21 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చెలామణిలో ఉండగా, వాటిల్లో రూ.2 వేల నోట్ల వాటా కేవలం 22.5 శాతంగా ఉందని, 2019 ఏప్రిల్ తర్వాత ఒక్క రూ.2 వేల నోటును కూడా ముద్రించలేదని పేర్కొంటున్నాయి.