శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (10:45 IST)

దేశంలో కరోనా తాజా లెక్కలు... 71 లక్షలకు చేరిన కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, గతంతో పోల్చితే గత 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 55,342 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 706 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,09,856 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 62,27,296 మంది కోలుకున్నారు. 8,38,729 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో సోమవారం వరకు మొత్తం 8,89,45,107 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం ఒక్కరోజులోనే 10,73,014 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,708 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,009 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,792కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,89,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,233 కు చేరింది. ప్రస్తుతం 24,208 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 277, రంగారెడ్డి జిల్లాలో 137 కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న మొత్తం 46,835 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య మొత్తం 36,24,096గా ఉంది.