శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (10:44 IST)

బ్రేకింగ్ న్యూస్.. దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారిగా నమోదు అవుతున్న సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 55342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. గడిచిన రెండు నెలల్లో వైరస్ కేసుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. 
 
సెప్టెంబర్‌లో వైరస్ కేసులు పెరిగిన తర్వాత.. 70 వేల కన్నా తక్కువ కేసులు వరుసగా నమోదు కావడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో వైరస్ వల్ల 706 మంది చనిపోయారు. 71,75,881 పాజిటివ్ కేసుల్లో.. ప్రస్తుతం 8,38,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 62,27,296 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 1,09,856కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
అలాగే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1708 పాజిటివ్ కేసులు నమోదుకాగా 5 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,14,792కి చేరింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 24,208 యాక్టివ్ కేసులుండగా 1,89,351 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1233 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 277, భద్రాద్రి కొత్తగూడెంలో 97, కరీంనగర్లో 86,ఖమ్మం లో 81, మేడ్చల్ లో 124, నల్గొండలో 81, రంగారెడ్డిలో 137 కేసులు నమోదయ్యాయి.