శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (10:46 IST)

పండుగ సీజన్‌లో కొత్త రైల్ రిజర్వేషన్ నిబంధనలు.. ఏంటవి?

దేశంలో పండుగ సీజన్ మొదలైంది. దీంతో రైల్వే శాఖ కూడా పండుగ సీజన్‌లో ఏర్పడే రద్దీని నివారించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇందుకోసం రద్దీ ఉన్న మార్గాలను గుర్తిస్తోంది. అయితే, ఈ పండుగ సీజన్‌లో రిజర్వేషన్ నిబంధనల్లో రైల్వే శాఖ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఈ నిబంధనలు గత శనివారం అంటే ఈ నెల పదో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపనుంది. ఈ సందర్భంగా టికెట్ బుకింగ్, రిజర్వేషన్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ఇన్నాళ్లూ కేవలం ఒకే రిజర్వేషన్ చార్టును మాత్రమే ప్రిపేర్ చేసేది. 
 
* ఇకపై గతంలోలాగా రెండో రిజర్వేషన్ చార్టును ప్రిపేర్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైలు బయల్దేరడానికి ముందు 30 నుంచి 5 నిమిషాలలోపు రెండో రిజర్వేషన్ చార్ట్‌ను ప్రిపేర్ చేయనుంది. 
 
* పాత పద్ధతి ప్రకారం రెండో రిజర్వేషన్ చార్టును అక్టోబరు 10 నుంచి ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. రెండో చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేయొచ్చు. రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతి ప్రకారమే 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించింది.
 
* గతంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండు గంటల ముందు చార్టును ప్రిపేర్ చేసేది. ఈ పద్ధతి కొన్ని నెలల పాటు ఇలాగే ఉంది. ఇక మొదటి రిజర్వేషన్ చార్ట్ రైలు బయల్దేరడానికి కనీసం నాలుగు గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. 
 
* మొదటి చార్టులో ఖాళీగా ఉన్న బెర్తుల్ని ప్రయాణికులు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయ్యేలోగా ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
 
* ఇక అప్పటికే బుక్ చేసిన రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉన్న రీఫండ్ రూల్స్ వారికి వర్తిస్తాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి భారతీయ రైల్వే సేవలు నిలిచిపోయిన విషయం తెల్సిందే. 
 
* అయితే, మే ఒకటో తేదీన శ్రామిక్ రైళ్లను నడపడం ద్వారా రైల్వే సేవల్ని పునరుద్ధరించారు. అప్పట్నుంచి దశలవారీగా రైళ్ల సంఖ్యను రైల్వే శాఖ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో పండుగ సీజన్‌లో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ళకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.