శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (11:49 IST)

కరోనా: శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్

కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని కంపెనీలు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ చేరింది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సిద్దమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులకు తమకు నచ్చితే.. పర్మనెంట్‌గా ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని కల్పించనున్నారు.
 
కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అమెరికాలోని తన ఆఫీసులను జనవరి వరకు ఓపెన్ చేసేదిలేదని కూడా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయాలనుకుంటే, వాళ్లు ఆఫీసులో తమ స్పేస్‌ను వదులుకోవాల్సి ఉంటుందని సంస్థ చెప్పింది. 
 
కోవిడ్-‌19 అనేక సవాళ్లను విసిరిందని, కొత్త పద్ధతుల్లో జీవించడం, పని చేయడం నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్యాథ్లీన్ హోగన్ తెలిపారు. వ్యక్తిగత వర్క్ స్టయిల్‌కు మద్దతు ఇచ్చేందుకు వీలైనంత సహకరిస్తామని, అదే విధంగా వ్యాపారం కూడా కొనసాగేలా చూస్తామన్నారు. పర్మనెంట్ పద్ధతిలో ఇంటి నుంచి పని చేయాలనుకున్నవాళ్లు తమ మేనేజర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.