గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (17:38 IST)

వెంకన్నా నీకిదితగునా... టిక్కెట్ కొంటేనే నీ దర్శనభాగ్యమా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనం నానాటికీ కరువైపోతోంది. టిక్కెట్ కొంటేనే శ్రీవారిని చూపిస్తామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, తితిదే అధికారుల తీరు ఉంది. వారు వ్యవహారశైలికూడా అలానే, కోవిడ్ నిబంధనల పేరుతో సర్వదర్శనం నిలిపివేసిన తితిదే అధికారులు... ఏదో ఒక టిక్కెట్ కొనుగోలు చేస్తే మాత్రం శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అంటే.. డబ్బులుంటేనే వెంకన్న దర్శనభాగ్యంగా మారింది. 
 
గత మార్చి నెలలో కోవిడ్ వైరస్ నియంత్రణ కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. కొన్ని నెలల పాటు సాగింది. ఆ సమయంలో కఠిన ఆంక్షలు అమలు చేశారు. ప్రస్తుతం ఈ లాక్డౌన్‌ను దశల వారీగా సడలిస్తూ వస్తున్నారు. అయితే, తితిదే అధికారులు మాత్రం కోవిడ్ నిబంధనల పేరుతో సర్వదర్శనం నిలిపివేశారు. దీంతో శ్రీవారి దర్శించుకోవాలన్న పేదవారు ఇపుడు ఏడుకొండలెక్కలేని పరిస్థితి నెలకొంది. 
 
అదేసమయంలో ప్రస్తుతం స్వామిని దర్శించుకుంటున్న వారంతా టికెట్లు కొన్నవారే. ఇలాంటి పరిస్థితి ముందెప్పుడూ లేదంటూ టీటీడీపై విమర్శలు తీవ్రమవుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అలిపిరికి చేరుకుని గుమికూడుతున్నారంటూ కొవిడ్‌ నిబంధనల పేరుతో సెప్టెంబరు 6 నుంచి ఉచిత టికెట్ల జారీని టీటీడీ అధికారులు రద్దు చేశారు. 
 
అలాగే, సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ.. సెప్టెంబరు 10వ తేదీ నుంచి ఆ 3 వేల టిక్కెట్ల కోటాను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మళ్లించింది. రోజుకు 16 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తోంది. 
 
వీటితో పాటు వీఐపీలకు బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళాన్ని ఇచ్చిన భక్తులకు, బోర్డు సభ్యుల సిఫారసుపై రూ.300 సుపథం ప్రవేశం, రూ.1000తో ఆన్‌లైన్‌ కల్యాణోత్సవం టికెట్లు కొన్నవారికి ప్రస్తుతం దర్శనం చేయిస్తున్నారు. 
 
ఇలా స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు 20 వేలు దాటుతోంది. మొత్తమ్మీద ఏదో టికెట్టు కొనుగోలు చేస్తే కానీ శ్రీవారి దర్శనం లభించే పరిస్థితి లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నా తితిదే అధికారులతో పాటు.. పాలక మండలి మాత్రం నోరు మెదపడం లేదు.