శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (18:05 IST)

మోడీ కూడా సతీసమేతంగా తిరుమలకు వెళ్తారా? మంత్రి కొడాలి నాని

ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు రెచ్చిపోయారు. తిరుమల డిక్లరేషన్‌తో పాటు.. తిరుమలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా ఎందుకు వెళ్లడం లేదంటూ టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
ప్రపంచంలోనే పవిత్ర పుణ్యస్థలంగా భాసిల్లుతున్న తితిదే ఆలయంలో తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు డిక్లరేషన్‌పై సంతకం చేయాలనే నిబంధన ఉంది. ఇది ఇపుడు రాజకీయ రంగును పులుముకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం జగన్ తిరుమలకు చేరుకోనున్న తరుణంలో ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 
 
డిక్లరేషన్‌పై సంతకం అవసరం లేదంటూ వ్యాఖ్యానించి అగ్నికి ఆజ్యం పోసిన మంత్ర కొడాలి నాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనదైన స్థాయిలో విపక్షాలపై నిప్పులు చెరిగారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టి, సతీసమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి జగన్ దర్శించుకోవాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై నాని విరుచుకుపడ్డారు. 
 
రాష్ట్రంలో అత్యధిక ఓట్లను సాధించిన జగన్‌కు సలహా ఇచ్చే స్థాయి బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలి అనే విషయంపై బీజేపీ నేతలు ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.
 
వైసీపీలో ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలి? అనే విషయాలను జగన్ కు బీజేపీ నేతలు చెప్పాల్సిన అవసరమేముందని నాని ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకుంటే మంచిదని అన్నారు. సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని తాము అంటే... ఆయనను పదవి నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్‌ను తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని నాని చెప్పారు.
 
తిరుమల వెంకన్న ఆశీస్సులతోనే జగన్ సీఎం అయ్యారని నాని చెప్పారు. సీఎం హోదాలోనే ఆయన తిరుమలకు వస్తున్నారని, స్వామికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని అన్నారు. డిక్లరేషన్‌పై సంతకం చేయాలనే నిబంధనను రాజులు పెట్టారా? బ్రిటీష్ వాళ్లు తీసుకొచ్చారా? అనే విషయంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నమ్మకం లేకుండా ఏ వ్యక్తి కూడా ఏడు కొండలు ఎక్కిరారని అన్నారు. వేంకటేశ్వరస్వామి ప్రపంచంలోని అందరికీ దేవుడేనని చెప్పారు. వెంకన్నను రాజకీయాలకు వాడుకోవడం దారుణమని అన్నారు.
 
అంతేకాకుండా, చర్చిలో కీర్తన పాడిన చంద్రబాబుకు 23 సీట్లు మాత్రమే వచ్చాయని నాని ఎద్దేవా చేశారు. జగన్‌కు మత పిచ్చి లేదని చెప్పారు. మతం ముసుగులో ఉన్న కొందరు హిందూ గురువులు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం తాను తిరుమలకు వచ్చి గుండు చేయించుకుంటానని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. 
 
ముందు మోడీని సతీసమేతంగా పూజలు చేయాలని చెప్పాలని... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎవరిని తీసుకెళ్లి పూజలు చేస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి పూర్తి మద్దతు ఇస్తున్న పార్టీ తమదని... బీజేపీ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి నాని తనదైనశైలిలో దుయ్యబట్టారు.