గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (10:49 IST)

కరోనాకు 24 గంటల్లో 333 మంది మృత్యువాత

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా మేరకు తగ్గింది. అయినప్పటికీ గత 24 గంటల్లో 24,337 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 25,709 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,55,560కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 333 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,45,810కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 96,06,111 మంది కోలుకున్నారు. 3,03,639 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,20,98,329 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,00,134 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 316 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 612 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,73,625 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,515కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 6,590 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  4,467 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 86 కరోనా కేసులు నమోదయ్యాయి.