శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా విజృంభణ : మళ్లీ లాక్డౌన్

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. దీంతో అప్రమత్తమైన ఆ దేశ ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించింది. లండన్‌తోపాటు దక్షిణ ఇంగ్లండ్‌లో లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్డౌన్ ఆంక్షలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
 
బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. బుధవారం నుంచి నమోదైన కరోనా కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువగానే కొత్తరకం వైరస్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ఈ కొత్తరకం వైరస్‌కు అడ్డుకట్ట వేస్తుందని చెప్పలేమన్నారు. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌లో తాజా ఆంక్షల ప్రభావం పండుగపై పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని బోరిస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. 
 
కరోనా వైరస్ కారణంగా ఈసారి క్రిస్మస్‌ను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యూకేలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా సాగుతోంది. మొదటి వారంలోనే దాదాపు 1.37 లక్షల మందికి తొలి డోసు టీకాను పంపిణీ చేశారు.