గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి లేనట్టే : వైద్య నిపుణులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు పలు దేశాల్లో రెండో దశ వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో బ్రిటన్ వంటి దేశాల్లో లాక్డౌన్ అమలు చేశారు. ఈ క్రమంలో భారత్‌లో కూడా కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రారంభమవుతుందనే హెచ్చరికలు వస్తున్నాయి. అయితే, దీనిపై వైద్య నిపుణులు స్పందిస్తూ, భారత్‌లో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయపడుతున్నారు. 
 
ఒక‌వేళ వ‌చ్చినా.. అది మొద‌టి వేవ్ స్థాయిలో ఉండ‌ద‌ని కూడా వాళ్లు తేల్చి చెబుతున్నారు. ప్ర‌స్తుతం దేశంలో కేసుల సంఖ్య కోటి దాటినా.. రోజువారీ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భారీగా త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త 21 రోజులుగా కేసుల సంఖ్య 40 వేల లోపే ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా స్ప‌ష్టం చేసింది. తాజాగా శ‌నివారం కూడా దేశంలో కేసుల సంఖ్య 26,624కు ప‌రిమితం కాగా.. కోలుకున్న వారి సంఖ్య 29,690 కావడం విశేషం. ఈ నేప‌థ్యంలో దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ముప్పు లేన‌ట్లేన‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు.
 
అయితే, ప్ర‌స్తుతం దేశంలో ఇంకా 30 నుంచి 40 శాతం మంది అస‌లు కొవిడ్ బారిన ప‌డ‌లేద‌ని ప్ర‌ముఖ కార్డియాల‌జిస్ట్ కేకే అగ‌ర్వాల్ చెప్పారు. ప్ర‌పంచంలో ఇండియా, అర్జెంటీనా, పోలాండ్‌తోపాటు 15 దేశాల్లో సెకండ్ వేవ్ క‌నిపించ‌డం లేద‌న్నారు. 
 
భారత్‌లో సెకండ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. ఒక‌వేళ వ‌చ్చినా అది వైర‌స్ కొత్త వేరియంట్ వ‌ల్ల వ‌స్తుంది. జ‌న‌వ‌రిలో ఇండియా వ్యాక్సినేష‌న్ మొద‌లుపెట్టి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే మాత్రం మార్చి క‌ల్లా క‌రోనాను పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి తీసుకురావ‌చ్చు అని అగ‌ర్వాల్ స్ప‌ష్టం చేశారు. 
 
కొత్త వేరియంట్ వ‌ల్ల సెకండ్ వేవ్ వ‌చ్చినా.. దాని వ‌ల్ల కేసులు పెరుగుతాయే గానీ మ‌ర‌ణాల సంఖ్య కాద‌ని ఆయ‌న చెప్పారు. పైగా దీనివ‌ల్ల హెర్డ్ ఇమ్యూనిటీ కూడా సాధించే అవ‌కాశాలు ఉన్నాయని తెలిపారు.