శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:34 IST)

దేశంలో పొంచివున్న కరోనా రెండో దశ సంక్రమణ!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నమోదువున్న పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఇది తెలుస్తుంది. ప్రస్తుతం ప్రతి రోజూ నమోదయ్యే కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు పడిపోయింది. అదేసమయంలో దేశంలో కరోనా వైరస్ రెండో దశ సంక్రమణ పొంచివుంది. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. 
 
వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్‌ మొదటి వారంలో కోవిడ్‌ ఉధృతి మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మహమ్మారి అయినా రెండో దశలో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, తదితర పశ్చిమదేశాల్లో కోవిడ్‌ సెకెండ్‌వేవ్‌ కేసులు, ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 
 
అయితే, మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి (ఫస్ట్‌వేవ్‌) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకెండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. పండుగల సీజన్‌లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రజలు ఏమేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై సెకెండ్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. 
 
ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారులు పూర్తిగా అంతమొంది, కనుమరుగైపోవడానికి ముందు 'మల్టీపుల్‌ వేవ్స్'గా వస్తాయని వైద్యులు అంటున్నారు.