శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (13:42 IST)

ఆ 2 జిల్లాల్లో కరోనా మృత్యు ఘంటికలు : జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ విజృంభణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. అటు కర్నూలు జిల్లాలోనూ ముగ్గురు ఈ మహమ్మారికి బలయ్యారు. గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు మరణించగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 119కి పెరిగింది. 
 
ఇక, కొత్తగా 462 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 40 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 15 మంది ఉన్నారు. దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది. 129 మందిని డిశ్చార్జి చేయగా, మొత్తం 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ఇంకా 5,123 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ మరింత తీవ్రమైంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 713 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అటు రంగారెడ్డి జిల్లాలోనూ ఇవాళ 107 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
 
ఇక, తెలంగాణ వ్యాప్తంగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 8,674కి పెరిగింది. తాజాగా 274 మంది డిశ్చార్జి అయ్యారు. ఓవరాల్ గా 4,005 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 4,452 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరో 7 గురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 217కి చేరింది.