శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (08:43 IST)

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన నైజీరియా

కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు పలు ప్రపంచ దేశాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, భారత్, జర్మనీ, చైనా వంటి ఎన్నో దేశాలు ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టే వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నాయి. 
 
అయితే, నైజీరియాకు చెందిన శాస్త్రవేత్తల బృందం మాత్రం ఓ వ్యాక్సిన్‌ను కనుగొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. అడిలెక్ యూనివర్శిటీలోని మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ నిపుణుడు డాక్టర్ ఒడడిపో కొలవోల్ ఈ విషయాన్ని వెల్లడించారని 'ది గార్డియన్ నైజీరియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 
 
ఆయన నేతృత్వంలోనే వాక్సిన్ ను ఆఫ్రికన్ల కోసం అభివృద్ధి చేశారని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను ఎవరైనా వినియోగించవచ్చని, ఇదేమీ నకిలీ వ్యాక్సిన్ కాదని, శాస్త్రవేత్తల అంకిత భావానికి దక్కిన ఫలితమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు. 
 
ఈ సూదిమందు అందరికీ అందుబాటులోకి రావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతున్నదని, మరిన్ని ట్రయల్స్, విశ్లేషణ చేస్తున్నామని, అధికార వర్గాల నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు.
 
ఆఫ్రికా మొత్తం విస్తృతంగా వెతికి సార్స్ కోవ్-2 జీనోమ్‌ను గ్రహించి, ఎన్నో ప్రయోగాలు చేశామని, శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారని, ప్రపంచానికి ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలైన గ్లెన్ మార్క్‌, హెటిరో, సిప్లా కంపెనీలు కరోనాకు మాత్రలతో పాటు... సూది మందులను కనుగొన్న విషయం తెల్సిందే.