ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (09:22 IST)

8 యేళ్ల బాలుడికి ఒమిక్రాన్ - గోవాలో తొలి పాజిటివ్ కేసు

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఇందులోభాగంగా, భారత్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గోవాలో ఎనిమిదేళ్ళ బాలుడికి ఈ వైరస్ సోకింది. ఈ నెల 17వ తేదీ నుంచి బ్రిటన్ నుంచి వచ్చిన ఈ బాలుడుకి ఎయిర్‌పోర్టులో నిర్వహించి వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 
 
ఆ తర్వాత అతని శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా, అతనికి సోకింది ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. కానీ, బ్రిటన్‌లో ఆ బాలుడు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం రావడం గమనార్హం. ప్రస్తుతం ఆ బాలుడి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే, గోవాలో తొలి ఒమిక్రాన్ కేసు కూడా ఇదే కావడం గమనార్హం. 
 
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒమిక్రాన్ 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతుంది. ఎట్ రిస్క్ దేశాలే కాదు.. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కూడా ఈ వైరస్ కనిపిస్తుంది. తాజాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 10 మందికి ఈ ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. వీరిని కలిసిన వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణా రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 12 కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం 55 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 10 మంది కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన మీడియా బులిటెన్ ప్రకారం మొత్తం 37,839 శాంపిల్స్ పరీక్షించగా, 182 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.