శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (10:46 IST)

24 గంటల్లో 62 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో 62,258 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 30,386 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,08,910కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,240 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,95,023 మంది కోలుకున్నారు. 4,52,647 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
దేశ వ్యాప్తంగా 5,81,09,773 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,97,69,553 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,64,915 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 247 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,878 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,685గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,241 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,870 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 142  మందికి క‌రోనా సోకింది.