1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (10:02 IST)

విశాఖకు కేటీఆర్ వెళతారా..?

విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశాఖకు ఎప్పుడు వెళతారన్న చర్చకు మరోసారి తెరలేచింది. తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల సమయంలో, తాను స్వయంగా విశాఖకు వెళ్లి ఉక్కు ఉద్యమంలో పాల్గొంటానని కేటీఆర్ ప్రకటించారు.

కేసీఆర్‌తో మాట్లాడి, ఆయన అనుమతితో విశాఖకు వెళతానని చెప్పారు. అది హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లోని సీమాంధ్ర గ్రాడ్యుయేట్ ఓటర్లను మెప్పించింది. చివరకు భాజపాను వ్యక్తిగతంగా అభిమానించే వారు సైతం, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సీమాంధ్ర గ్రాడ్యుయేట్లు తెరాస అభ్యర్ధి వాణీదేవికి ఓట్లు వేసి, ద్వితీయ ప్రాధాన్యం కింద బీజేపీకి వేశారు.
 
ఎన్నికల ముందు విశాఖ పర్యటనపై హామీ ఇచ్చిన కేటీఆర్, ఫలితాలు వెలువడి వారం దాటినప్పటికీ మళ్లీ ఆ ప్రస్తావన చేయకపోవడం చర్చనీయాంశమయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ అంశాన్ని ప్రస్తావించారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఎన్నికల తర్వాత మళ్లీ కేటీఆర్ విశాఖ గురించి మాట్లాడరని వారు జోస్యం చెప్పారు. విశాఖ ఉద్యమంపై అంత చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు కేటీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల ముందు ఆంధ్రావారి ఓట్ల కోసం జిమ్మిక్కులు చేయడం టీఆర్‌ఎస్‌కు అలవాటేనని రేవంత్‌రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే.