ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తిరుపతి లోక్‌సభ బైపోల్ : ఓటర్లకు సిరా గుర్తు ఎక్కడ వేస్తారంటే?

తిరుపతి లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (వైకాపా) గత యేడాది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. దీంతో ఆయా పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రకటించాయి.
 
అధికార వైకాపా నుంచి సీఎం జగన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుంచి చింతా మోహన్, బీజేపీ - జనసేన పార్టీ నుంచి డాక్టర్ రత్నప్రభలు తలపడుతున్నారు. 
 
ఈ ఉప ఎన్నిక కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే వారికి అధికారులు ఎడమ చేతి చూపుడు వేలికి బదులు కుడిచేతికి సిరా గుర్తు పెట్టనున్నారు. 
 
ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు వారి ఎడమ చేతికి సిరా గుర్తు పెట్టారు. ఆ గుర్తు ఇంకా చెరిగిపోకపోవడంతో ఉప ఎన్నికలో కుడి చేతికి సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.