1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (15:57 IST)

తిరుపతి బై పోల్ ఎఫెక్ట్ .. నరంలేని నాలుక... అమరావతిపై మాట మార్చిన వీర్రాజు!

భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చారు. నిన్నామొన్నటివరకు మూడు రాజధానుల అంశంపై నోరు మెదపని ఆయన ఇపుడు పల్టీ కొట్టారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఏపీలో ఖాళీగా ఉన్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక జరుగనుంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పరితపిస్తున్న ఏపీ బీజేపీ శాఖ ఇపుడు రాజధాని అమరావతి అంశంపై క్లారిటీ ఇచ్చింది. 
 
ముఖ్యంగా, ఒక రాష్ట్ర రాజధాని అంశంలో తమకుగానీ, కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వానికిగాని ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇపుడు మాట మార్చారు. ఏపీకి ఒక్క రాజధానే ఉండాలని, అదీకూడా అమరావతిగా ఉండాలని ప్రకటించారు. పైగా, తమ పార్టీ మూడు రాజధానులకు వ్యతిరేకమని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సెలవిచ్చారు. 
 
నిజానికి అమరావతి అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా బీజేపీ వైఖరి ఏమిటో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. 
 
రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ లక్ష్యమన్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని పునరుద్ఘాటించారు. తుళ్లూరులో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు ప్రకటించారు. అమరావతిలో రూ.1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తి చేశామని... మోడీ అమరావతి వైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. 
 
ఏపీ బీజేపీ కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బీజేపీ మాట తప్పే పార్టీ కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తరపున ఉద్యమం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందిస్తే... అమరావతిని మరింత అభివృద్ది చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.