శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (18:24 IST)

ఏపీలో కరోనా కేసులు : గుంటూరులో 176 - విశాఖలో 170

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే వాటిలో వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రెండో దశ కరోనా సంక్రమణ ప్రారంభమైందని వైద్యులు భావిస్తున్నారు. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 176 మందికి పాజిటివ్ అని నిర్ధారణ కాగా, విశాఖ జిల్లాలో 170, చిత్తూరు జిల్లాలో 163 కొత్త కేసులు వెల్లడయ్యాయి. 
 
కృష్ణా జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 306 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు.
 
ఏపీలో ఇప్పటివరకు 8,96,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,515 మంది కరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,145 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల మృతి చెందినవారి సంఖ్య 7,203కి పెరిగింది.
 
ఒక్క గురువారమే ఏపీలో 758 మందికి కరోనా సోకగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఒకే కుటుంబంలోని 21 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మొన్న 53,476 మందికి కరోనా నిర్ధారణ కాగా, గ‌త 24 గంటల్లో 59,118 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,987 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 257 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,64,637 మంది కోలుకున్నారు. 
 
4,21,066 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 5,55,04,440 మందికి వ్యాక్సిన్లు వేశారు.