శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (12:57 IST)

కరోనా విజృంభణ : ఒకే ఇంట్లో 21 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం ఏపీలో 758 మందికి కరోనా సోకగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఒకే కుటుంబంలోని 21 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపింది.
 
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ కుటుంబంలోని ఓ విద్యార్థి, రాజమహేంద్రవరంలోని ఓ కాలేజీలో చదువుకుంటూ ఇటీవల ఇంటికి వచ్చాడు. ఇటీవల అతను ఇంటికి వచ్చాడు. ఆపై ఇంట్లోని వారంతా అనారోగ్యం బారిన పడ్డారు. 
 
ప్రతి ఒక్కరికీ జ్వరం, జలుబు వంటి సమస్యలు రాగా, నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు, మొత్తం అందరికీ కరోనా సోకినట్టుగా నిర్ధారించారు.
 
దీంతో వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు, గడచిన మూడు నాలుగు రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై ఆరా తీస్తున్నారు.
 
ఇదిలావుంటే, దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మొన్న 53,476 మందికి కరోనా నిర్ధారణ కాగా, గ‌త 24 గంటల్లో 59,118 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 257 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,64,637 మంది కోలుకున్నారు. 4,21,066 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 5,55,04,440 మందికి వ్యాక్సిన్లు వేశారు.