శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (09:34 IST)

నాకు కరోనా వైరస్ సోకింది : మాజీ సీఎం సిద్ధరామయ్య

తనకు కరోనా సోకిందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతోపాటు ఆయన కుమార్తె పద్మావతి కూడా కరోనా బారినపడగా, కుమారుడు విజయేంద్రకు మాత్రం నెగటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
ఇపుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా వైరస్ కోరల్లో చిక్కారు. అయితే, వైద్యుల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఇటీవల తనతో కలిసిన వారిలో ఎవరికైనా వైరల్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సిద్ధరామయ్యకు సోమవారం జ్వరంగా ఉండడంతో కరోనా యాంటీజెన్ పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని సిద్ధరామయ్య కుమారుడు తెలిపారు.
 
కాగా, సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలంటూ కరోనా బారినపడిన ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, జనతా దళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ ఆకాంక్షించారు. అలాగే, యడ్యూరప్ప కార్యాలయంలోని ఆరుగురు సిబ్బందికి కూడా సోమవారం కరోనా సోకింది.