1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (11:08 IST)

హనీమూన్ కోసం ఇటలీ వెళ్లిన కన్నడ జంట... మైసూరుకు రావొద్దంటూ కలెక్టర్ ఆర్డర్

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. ఇపుడు మరింత శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన గాయకుడు చందన్ శెట్టి ఇటీవల నివేదితా గౌడ్ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఈయన హనీమూన్ కోసం తన భార్యను తీసుకుని ఇటలీ వెళ్లాడు. 
 
అయితే, ఆయన ఇటలీ వెళ్లక ముందు కరోనా వైరస్ పెద్దగా వ్యాపించలేదు. కానీ, ఇటలీలో అడుగు పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులను చూసి వణికిపోయారు. దీంతో ఆయన తన హనీమూన్ ఆనందాన్ని పక్కనబెట్టేశాడు. పైగా, తమ ప్రయాణాన్ని అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి వచ్చాడు. ఈ విషయం మైసూరు వాసులకు తెలిసింది. అంతే.. వారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మైసూరులో పలు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టరును కలిసిన పలువురు, ఇంతవరకూ మైసూరులో కరోనా లేదని, వారిద్దరినీ నగరంలోకి వెంటనే అనుమతించ వద్దని విజ్ఞప్తి చేశారు. వారికి ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, సామాన్యులను చూస్తున్నట్టుగానే 14 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి, ఆపై మాత్రమే వారిని అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ కూడా వారిద్దరూ మైసూరుకు రావొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. దీంతో వారిద్దరూ ఇపుడు బెంగుళూరులోనే ఉండిపోయినట్టు సమాచారం.