శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (10:57 IST)

వ్యాక్సిన్ వేసుకున్న కరోనా రాదన్న గ్యారెంటీ లేదు...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు టీకాల తయారీలో నిమగ్నమైవున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్లు ప్రభావంతంగా పని చేస్తున్నాయి. దీంతో పలు దేశాల్లో ఈ టీకాల పంపిణీకి అనుమతులు కూడా లభించాయి. 
 
ఈ క్రమంలో తాజాగా ఓ విషయం వెల్లడైంది. కరోనా టీకా వేసుకున్నంత మాత్రానా ఈ వైరస్ బారినపడుకుండా ఉండలేరన్న గ్యారెంటీ లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీకా వేసుకున్న తర్వాత కూడా వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతికదూరం పాటిస్తూ, ముఖానికి విధిగా మాస్కులు ధరించాలని వారు సూచన చేస్తున్నారు. 
 
అంటే కరోనా వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా కొంతకాలం పాటు మాస్కు ధరించక తప్పదంటున్నారు. భౌతికదూరం సహా కరోనా జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఎందుకంటే, సాధారణంగా టీకా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 
 
మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు ఫైజర్‌ టీకా అయితే.. రెండు వారాలు.. మొడెర్నా అయితే నాలుగు వారాల సమయం ఉంటుంది. టీకాల ప్రభావం అవి తీసుకున్న వెంటనే కనిపించదని, అందుకు కనీసం రెండు వారాలు పడుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నిపుణుడు డెబోరా ఫుల్లర్‌ తెలిపారు.
 
అంటే.. ఆ రెండు వారాలూ మాస్కు ధరించడంతో పాటు నిబంధనలు కూడా పాటించాల్సిందే అని వివరించారు. అలాగే రెండో డోసు తర్వాత కూడా మరో రెండు వారాల పాటు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని సూచిస్తున్నారు. 
 
అసలు.. టీకా.. కరోనా నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుందా.. లేకపోతే లక్షణాలు మాత్రం కనబడకుండా చేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదని తెలిపారు. టీకాల పనితీరు ఎలా ఉన్నప్పటికీ.. వ్యాక్సినేషన్‌ తర్వాత రోగ నిరోధక శక్తి మాత్రం పెరుగుతుందని చెపుతున్నారు.