గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

కరోనాకు ఉచిత టీకా - ఉచిత విద్యుత్: జీహెచ్ఎంసీ పోరు కోసం బీజేపీ వరాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ భాగ్యనగరి వాసులపై వరాల జల్లు కురిపించింది. జీహెచ్ఎంసీ పోరులో మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటే నగర ప్రజలకు ఉచితంగా కరోనా టీకా అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే, అన్ని ప్రాంతాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తామని, ఇందుకు సమర్థ ఆరోగ్య ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 
 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంతో నగరవాసులపై రూ.15 వేల కోట్ల భారం పడుతోందని, తాము గెలిస్తే ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు లేకుండా కట్టుదిట్టమైన చట్టం అమలు చేస్తామన్నారు.
 
ఈ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా విడుదలైంది. సామాన్యుడి ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని, ప్రజల సలహాలు స్వీకరించి మేనిఫెస్టోను రూపొందించామని ఫడ్నవీస్ తెలిపారు. కరోనా విజృంభణ వేళ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయని ఆయన అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారని తెలిపారు. 
 
రాజ్యాంగాన్ని మోదీ సర్కారు కాపాడుతోందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నామని, తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీ పాత్ర మరువలేనిదని అన్నారు.  ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే హైదరాబాద్ మునిగిపోయిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.
 
కాగా, బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
* గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
* గ్రేటర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ రద్దు
* గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు
* విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం
* ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు 
* పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ 
* లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ ఏర్పాటు 
* మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు 
* హైదరాబాద్ మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ 
* గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు 
* గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్ 
* 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా 
* కులవృత్తులకు ఉచిత విద్యుత్ 
* ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ 
* వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక 
* వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున నగదు