శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (19:03 IST)

బల్దియా పోరులో తెరాసకు మద్ధతు ఇవ్వండి : నటుడు కాదంబరి కిరణ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇవ్వాలని ప్రముఖ నటులు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. టాలీవుడ్‌ను కాపాడుతాననే మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటున్నారని కాదంబరి చెప్పారు. 
 
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన 40 వేల మంది సినీ కార్మికుల కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపిందని కాదంబరి కిరణ్ అన్నారు. అయితే చిత్ర పరిశ్రమకు కేటాయించే 1500 ఎకరాల్లో కొంత స్థలాన్ని కార్మికుల నివాసాల కోసం కేటాయించాలని కాదంబరి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్ చెప్పిన తొలి మాట సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటామని. ఆ ఒక్క మాట మాలో ఎంతో ధైర్యం నింపింది. ఆ మాటను నిజం చేస్తూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. సాయం కోరిన పేద వారికి, ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన వారికి అండగా మనం సైతం సేవా సంస్థ ఉంటోంది. 
 
మా సంస్థకు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం సహకారం అందిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అవసరంలో ఉన్న బాధితులకు సహాయం చేస్తున్నారు. పేదలను ఆదుకునే ఎవరైనా నాకు దేవుళ్లే. ఈ ప్రభుత్వం పేదలను ఆదుకుంటున్న తీరు చూసే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరాసకు ఓటేయ్యమని అందరి కంటే ముందుగా చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మనం సైతం నుంచి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నాం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన 40 వేల మంది సినీ కార్మికుల కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపింది. చిత్ర పరిశ్రమకు కేటాయించే ఈ 1500 ఎకరాల్లో కొంత స్థలాన్ని కార్మికుల నివాసాల కోసం కేటాయించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 
 
పేదల సంక్షేమం కోసం ఎన్నో మంచి పథకాలను రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం... సినీ పరిశ్రమపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం అదృష్టంగా భావిస్తున్నాం. మనసైతం తరపున కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సురేష్, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.