గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (17:19 IST)

ఏపీలో ఏమాత్రం తగ్గని పాజిటివ్ కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదుతో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,280 సాంపిల్స్‌ని పరీక్షించగా 2,527 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు. అలాగే, గడచిన 24 గంటల్లో 2,412 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య…23939 కాగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1909613, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య… 1946749, మొత్తం మరణాల సంఖ్య…13197గా ఉంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కారణంగా నలుగురు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో మంగళవారం బ్లాక్ ఫంగస్‌పై ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. 
 
బ్లాక్ ఫంగస్‌తో దేశవ్యాప్తంగా 4,332 మంది మరణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.
 
ఇక కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పీఎంజీకేపీ బీమా కింద ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా చెల్లించినట్టు కేంద్ర సహాయమంత్రి భారతీ పవార్ తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నుంచి 64 క్లెయిమ్స్ వచ్చాయని, వాటిలో 53 పరిష్కరించామన్నారు.