1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (13:15 IST)

ముంబై ఇండియన్స్ జట్టుకు శుభవార్త : జట్టులో చేరనున్న సూర్యకుమార్

surya kumar yadav
వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ భారీ ఊరట లభించింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నం.1 టీ20 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టుతో చేరాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడంతో శుక్రవారం ఎంఐ జట్టు బస చేసిన హోటల్‌కు సూర్య రావడాన్ని ముంబై ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియో విడుదల చేసింది.
 
ఇందులో సూర్య తన కారు నుంచి దిగి హోటల్‌కు వెళ్లడం మనం చూడొచ్చు. కాగా, సూర్యకుమార్ గతేడాది డిసెంబరులో దక్షిణాఫ్రికాపై చివరి సారిగా క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఎన్సీఏలోనే ఉండి గాయం నుంచి కోలుకున్నాడు.
 
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డ సూర్యకుమార్ ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే సూర్య ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎంఐ ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోయాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న 32 ఏళ్ల సూర్య ఈ నెల 7న (ఆదివారం) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తో జరగబోయే మ్యాచ్‌లో బరిలోకి బరిలోకి దిగే అవకాశం వుంది. 
 
ఇక ఎంఐ తరఫున 87 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన అతడు ఇప్పటివరకు 2,688 పరుగులు చేశాడు. ఇప్పుడు సూర్య తిరిగి రావడంతో నిస్సందేహంగా ముంబై మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ కావడంతో పాటు జట్టు మొత్తం బలోపేతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ముంబై ఐపీఎల్ 17వ సీజన్‌ను చాలా పేలవంగా ప్రారంభించింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.