1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (11:26 IST)

ఐపీఎల్ 2024 : ముంబై ఫ్యాన్స్ దాడి.. సీఎస్కే జట్టు అభిమాని మృతి!!

ipl2024
స్వదేశంలో ఐపీఎల్ 2024 సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే, కొన్ని మ్యాచ్‌లు జరుగుతున్నపుడు ఆయా జట్ల అభిమానులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. దీంతో కొన్ని అవాంఛనీయ, విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 27వ తేదీన ముంబై ఇండియన్స్, హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఓ వివాదం చెలరేగింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో గాయపడిన సీఎస్కే అభిమాని గాయపడ్డారు. రోహిత్ శర్మ వికెట్ పడిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమాని ఒకరు హేళన చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని ముంబై ఇండియన్స్ అభిమాలు ఆయనపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గాయపడిన సీఎస్కే అభిమానిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది. మృతుడిని బండోపంత్ బాపుసో టిబిలేగా గుర్తించారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని కొల్హారూప్‌లోని కొంతమంది ఒకచోట చేరి హైదరాబాద్, ముంబై మ్యాచ్‌ను వీక్షించారు. వీరిలో కొందరు సీఎస్కే అభిమానులుంటే మరికొందరు ముంబై జట్టు అభిమానులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ పడింది. దాంతో రోహిత్ ఔట్ అయిన వెంటనే సీఎస్కే అభిమాని అయిన 63 యేళ్ల బండోపంత్ బాపుసో టిబిలే హేళన చేశాడు. హిట్‌మ్యాన్ వికెట్‌‍ను సెలబ్రేట్ చేసుకున్నాడు. 
 
బండోపంత్‍ అలా చేయడం నచ్చని ముంబై అభిమానులు ఆయనపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. అతని తలపై కర్రలతో బలంగా కొట్టడంతో బండోపంత్‌కు తీవ్ర రక్తస్రావమై, అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపుమడుగులో పడివున్న అతడిని ఇతరులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన బాధితుడు ఆదివారం కన్నుమూశాడు. కాగా, బండోపంత్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులిద్దరినీ ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.