బుధవారం, 29 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

babu - pawan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తుఫాను కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలపై సర్కారు దృష్టిసారించింది. ఇందులోభాగంగా, తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగిపొర్లే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. 
 
మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి మొంథా తుఫాను ప్రభావం, ప్రభుత్వ సన్నద్ధతపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మొంథా తుఫాను అత్యంత వేగంగా తీరానికి సమీపిస్తోందని, ఈ అర్థరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 
 
ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం సహా పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాలకు తక్షణమే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని ఆదేశించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యంత్రసామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గడచిన అనుభవాలను, ముఖ్యంగా హుద్ హుద్ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటూ, అప్పటి స్ఫూర్తితో కేవలం నాలుగు రోజుల్లోనే ప్రజలను గట్టెక్కించామని, అదే పట్టుదలతో ఇప్పుడు పనిచేయాలని పిలుపునిచ్చారు.
 
మరోవైపు, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎంత విస్తీర్ణంలో నీరు నిలిచింది, ఏయే వాగులు పొంగే ప్రమాదం ఉందో ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నందున ఎర్రకాలువకు ఎగువ నుంచి ఆకస్మిక వరద ప్రవాహం వచ్చే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతంలో అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.