మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశం
మొంథా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. దీంతో కేంద్ర రైల్వే శాఖ కూడా అలెర్ట్ అయింది. ఈ తుఫాను కారణంగా ఏదేని తీరని నష్టం జరిగితే తక్షణం చర్యలతో పాటు సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా వార్ రూమ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్ దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అవసరమైన సామగ్రి, యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మొంథా తుఫాను దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరారు. తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర వేళల్లో సత్వరం స్పందించాలన్నారు.