1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జులై 2025 (12:02 IST)

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట - రైలు బోగీల్లో నిఘా నేత్రాలు

cctv
ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా తయారు చేసే రైలు బోగీలతో పాటు అవకాశం ఉన్న పాత బోగీల్లో కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు. ఈ విషయాన్ని కేంద్రం రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 74 వేల రైలు బోగీల్లో ఈ నిఘా నేత్రాలను అమర్చనున్నారు. తలుపుల వద్ద ఈ కెమెరాలు అమర్చుతామని తెలిపారు. 
 
ఈ చర్య ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని, ప్రయాణికులను లక్ష్యంగా చేసుకునే దుండగులు, దోపిడీ ముఠాలను నిరోధిస్తుందని అధికారులు భావిస్తున్నారు. నార్తర్న్ రైల్వేలో లోకో ఇంజన్లు, కోచ్‌లలో విజయవంతంగా సీసీటీవీ కెమెరాల ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
 
ప్రతి రైలు కోచ్‌కు డోమ్ తరహా నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్రవేశ మార్గంలో రెండు కెమెరాలు ఉంటాయి. అదేవిధంగా, ప్రతి లోకోమోటివ్ ఆరు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఒకటి ముందు వైపు, ఒకటి వెనుక వైపు మరియు రెండు వైపులా ఉంటాయి. లోకో యొక్క ప్రతి క్యాబ్‌లో (ముందు మరియు వెనుక) ఒక డోమ్ సీసీటీవీ కెమెరా మరియు రెండు డెస్క్-మౌంటెడ్ మైక్రోఫోన్లు అమర్చబడతాయి.
 
గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో కూడా మరియు తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో కూడా అధిక-నాణ్యత గల దృశ్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైష్ణవ్ రైల్వే అధికారులను కోరారు. ఇండియా ఏఐ మిషన్‌తో భాగస్వామ్యంతో, సీసీటీవీ కెమెరాల ద్వారా సేకరించిన డేటాపై కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని అన్వేషించాలని రైల్వే మంత్రి అధికారులను ప్రోత్సహించారు.