1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: గురువారం, 7 అక్టోబరు 2021 (15:18 IST)

2 కోట్ల కట్నమిస్తేనే రమ్మంటున్నాడు.. భార్య ఆవేదన..?

ఇద్దరూ వైద్యులే. జర్మనీలో వైద్యుడిగా సెటిలయ్యాడు భర్త. భార్యను తీసుకెళ్ళాడు. కానీ భార్య పెళ్ళికి ముందు ఇచ్చిన కట్నం అతనికి సరిపోలేదు. దీంతో వేధింపులు మొదలెట్టాడు. భార్యను ఎలాగైనా విడిపించుకోవాలని కన్నకూతురిని చంపేందుకు ప్రయత్నించాడు. 2 కోట్ల రూపాయలు కట్నం ఇస్తేనే ఇంటికి రమ్మంటున్నాడటూ బాధితురాలు ఆవేదనకు గురైంది. 
 
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట ప్రాంతానికి చెందిన తేజస్విని అనే మహిళ తన భర్త కావాలంటూ ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది. శ్రీకాళహస్తి కొండమిట్ట ప్రాంతానికి చెందిన తేజస్వినికి, అదే ప్రాంతానికి చెందిన విక్రమ్ రావ్ కు 2016సంవత్సరంలో వివాహమైంది.
 
వీరికి ఒక కుమార్తె ఉంది. ఇద్దరూ వైద్యులే. పెళ్ళయిన తరువాత కొన్నినెలలకు జర్మనీకి వెళ్ళాడు విక్రమ్ రావ్. అక్కడే వైద్యుడిగా కొనసాగుతున్నాడు. వీరికి కూతురు పుట్టినప్పటి నుంచి విక్రమ్ రావ్ వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. వరకట్నం కావాలని... తనకు 2 కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయి సిద్థంగా ఉందని భార్యను వేధించాడు.
 
ఇంటికి వెళ్ళి తాను అడిగినంత డబ్బులు తీసుకురావాలన్నాడు. లేకుంటే తన గదిలోని రావద్దని హాలులో తనను పడుకోబెట్టేవాడని బాధితురాలు ఆరోపిస్తోంది. భర్త ఇంటి నుంచి అత్త తనను బయటకు తోసేసిందని.. తన కుమార్తెను చంపేందుకు భర్త, అత్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
 
తన భర్తపై శ్రీకాళహస్తి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది.