1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (10:29 IST)

కుమార్తె వరుసయ్యే యువతితో ప్రేమ.. యుకుడిని హత్య చేసిన తండ్రి...

murder
కుమార్తె వరుసయ్యే యువతితో ప్రేమ పేరుతో అనైతిక సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని యువతి తండ్రి మరో నలుగురితో కలిసి హత్య చేశాడు. గత నెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఈ హత్య జరిగింది. హత్య తర్వాత పరారైన నిందితులు.. ఆ నెల రోజుల తర్వాత ఓ మహిళకు ఫోను చేసి పోలీసుల చేతికి చిక్కారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్‌కు చెందిన కరణ్‌కుమార్‌ (18) అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెళ్లిలో ఓ కోళ్ల ఫారంలో కూలీపనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్‌ కుమార్‌ కుటుంబం సహా నిర్దవెల్లికి ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్లఫారంలో పనిచేస్తుంది. కరణ్‌కుమార్‌, రంజిత్‌కుమార్‌ ఒకే ప్రాంతానికి చెందినవారుతో పాటు పైగా వరుసకు సోదరులు కూడా. ఈ క్రమంలో వావివరసలు మరిచి కరణ్‌ కుమార్‌... రంజిత్‌కుమార్‌ కూతురిపై మనసు పారేసుకుని ప్రేమించాడు. ఇది వారిద్దరి మధ్య అనైతిక సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రంజిత్‌ కుమార్... కరణ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. ఇది మంచి పద్దతి కాదనీ, నీకు కూడా కుమార్తె వరుసే అవుతుందని చెప్పాడు. కానీ, ప్రేమ మైకంలో ఉన్న కరణ్.. ఇవేవీ పట్టించుకోలేదు. కొద్దిరోజుల పాటు యువతిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. దీంతో రంజిత్‌ గట్టిగా బెదిరించాడు. అనంతరం కరణ్‌ సిద్ధిపేటకు వెళ్లి పనిలో కుదిరాడు. అక్కడికెళ్లినా అతనిలో మార్పురాలేదు. 
 
ఆమెతో తనకు వివాహమైందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. యువతి నుదుట కుంకుమ పెట్టిన ఫోటోలు పోస్టు చేసేవాడు. విసిగిపోయిన రంజిత్‌.. కరణ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయస్తులైన బీహార్‌కు చెందిన ముంతోష్‌కుమార్‌, బబ్లూ, మరో ఇద్దరు మైనర్ల సాయం కోరాడు.
 
రంజిత్‌ పథకం ప్రకారం ఆగస్టు 15న కరణ్‌కు ఫోన్‌ చేశాడు. పొలంలో పనివుంది రమ్మని చెప్పి పిలిపించి నిర్దవెల్లి-జూలపల్లి మధ్య రహదారి పక్కకు తీసుకెళ్లాడు. అక్కడే బురద నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. అక్కడే పాతిపెట్టి పరారయ్యారు. తన తమ్ముడు కనిపించడం లేదంటూ కరణ్‌ అన్న దీపక్‌ గత నెల 29న కేశంపేట పోలీసులకు ఫిర్యాదుచేశాడు. 
 
వారు కేసు నమోదు చేసి కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. చివరిసారిగా రంజిత్‌ కాల్‌ చేయడం, కరణ్‌ ఫోన్‌ సిగ్నల్‌ నిర్దవెల్లి మధ్య ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాల మేరకు రంజిత్‌ హత్య చేసినట్లు రుజువైంది. ఈలోపే నిందితులు ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. ఫోన్లు స్విచాఫ్‌ చేయడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టమైంది. ఈ సమయంలోనే నిందితుల్లో ఒకరు యువతికి కాల్‌ చేసి స్విచాఫ్‌ చేశారు. 
 
ఈ సమాచారం అందుకున్న కేశంపేట ఎస్ఐ వరప్రసాద్‌, కానిస్టేబుల్‌ శివ ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో నిందితులు తలదాచుకున్నట్లు గుర్తించారు. అక్కడికెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితుల్ని రిమాండుకు.. ఇద్దరు మైనర్లను జువైనల్‌ హోంకు తరలించారు.