శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (08:26 IST)

క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న ప్రేమజంట.. ఎక్కడ?

lovers
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ ప్రేమజంట క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంది. ఈ ప్రేమ జంటకు పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల సభ్యులు సమ్మతించినప్పటికీ, అప్పుల భారం అధికం కావడంతో వివాహం తర్వాత సాఫీగా సంసార జీవితం చేయలేమని భయపడ్డారు. దీంతో తొలుత ప్రియుడు శ్రీకాంత్ పురుగుల మందు సేవించాడు. ఆ తర్వాత సంఘవి కూడా సేవించింది. దీంతో వారిద్దరూ కొన్ని గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే, మంచిర్యాల జిల్లా హజీపూర్‌ మండలం దొనబండకు చెందిన నరెడ్ల సిద్ధయ్య, వసంత దంపతుల చిన్న కుమార్తె సంఘవి (21). డిగ్రీ పూర్తి చేసి ఇంటిపట్టునే ఉంది. అదే గ్రామానికి ఆటో డ్రైవర్ శ్రీకాంత్‌ (25)ను ప్రేమించింది. వీరిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు వారికి పెళ్లి చేసేందుకు సమ్మతించారు. 
 
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీకాంత్.. తన ఆటోలో సంఘవిని తీసుకుని ఎల్లంపల్లి జలాశయం వైపు వెళ్లాడు. అక్కడ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత అప్పులు పెరిగిపోయాయని, పెళ్లిచేసుకుంటే జీవితం కష్టంగా మారుతుందని, అందువల్ల తాను పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. పైగా, తాను అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించాడు. దీంతో భయపడిపోయిన సంఘవి కూడా ఆ పురుగుల మందు డబ్బాను బలవంతంగా లాక్కొని తాను కూడా సేవించింది. 
 
అయితే, ఎలాగైనా బతకాలి అన్న ఆలోచనతో తామిద్దరం పురుగుల మందు సేవించిన విషయాన్ని శ్రీకాంత తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆటోలో సంఘవిని తీసుకుని సమీపంలోని ఆస్పత్రికి వెళ్లారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో మరో ప్రైవేటు ఆస్పత్రికి తరించారు. అయితే, పరిస్థితి మరింత విషమించడంతో వారు కొన్ని గంటల వ్యవధిలో శ్రీకాంత్, సంఘవిలు చనిపోయారు. దీనిపై హజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.