గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (22:19 IST)

భారతదేశ ముద్దుబిడ్డ... రాజకీయాల్లో ఆజాత శత్రువు ప్రణబ్ దాదా

మచ్చలేని రాజకీయ నేతలకు నిలువెత్తు నిదర్శనం ప్రణబ్ దాదా. దేశంలోని రాజకీయ ఉద్ధండుల్లో దాదా ఒకరు. పక్కా కాంగ్రెస్ వాది అయినప్పటికీ... ప్రతి ఒక్కరికీ అందరివాడుగా, ఆదర్శవాదిగా మారిపోయాడు. అలాంటి దాదా ఇపుడు లేరు. సోమవారం సాయంత్రం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. 
 
ప్రణబ్ మృతితో రాజకీయపార్టీలకు అతీతంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ప్రణబ్ జీవిత చరిత్రను ఓసారి పరికిస్తే...
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రణబ్ దాదా.. 1935 డిసెంబరు 11వ తేదీన బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిరాఠీలో అనే గ్రామంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు ప్రణబ్ కుమార్ ముఖర్జీ. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ (కెక్ ముఖర్జీ) స్వాతంత్ర్య సమర యోధుడు. 
 
తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జీ. ప్రణబ్ రాజనీతి శాస్త్రం, చరిత్ర సబ్జెక్టుల్లో ఎంఏతో పాటు ఎల్ఎల్‌బీ పట్టా కూడా అందుకున్నారు. ప్రణబ్‌కు అక్కయ్య అన్నపూర్ణ, తమ్ముడు పియూష్ ఉన్నారు.
 
ఇక దాదా కుటుంబం విషయానికొస్తే.... ఆయనకు 1957లో సువ్రాతో వివాహం జరిగింది. ప్రణబ్-సువ్రా ముఖర్జీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అభిజిత్ ముఖర్జీ, కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ.
 
వీరిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. ప్రణబ్ మొదట్లో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో యూడీసీ‌గా పనిచేశారు. ఆ తర్వాత కోల్‌కతాలోని విద్యానగర్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. రాజకీయాల్లోకి రాకముందు దేషేర్ డాక్ అనే పత్రికలో జర్నలిస్టుగానూ సేవలు అందించారు.
 
ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిభను గుర్తించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించారు. ఆయనను ఎంతో ప్రోత్సహించారు. 1969లో రాజ్యసభకు వెళ్లడం ఆయన పొలిటికల్ కెరీర్‌లో ఓ మలుపు అని చెప్పాలి. 
 
అక్కడి నుంచి 75, 81, 93, 99లోనూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో లోక్‌సభకు ఎన్నికైన ఆయన 2012 వరకు కొనసాగారు. అంతకుముందు 1993 నుంచి 1995 వరకు కేంద్ర వాణిజ్యమంత్రిగా, 1995 నుంచి 1996 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. 2006 నుంచి 2009లోనూ అవే బాధ్యతలు నిర్వర్తించారు.
 
ఇకపోతే, గత యూపీఏ -1 ప్రభుత్వ కాలంలో 2004 నుంచి 2006 వరకు రక్షణమంత్రిగా, యూపీఏ -2 ప్రభుత్వ హయాంలో అంటే 2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగా పదవులు అలంకరించారు. 2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన 2017 వరకు కొనసాగారు.
 
ప్రణబ్ భారత్‌లోనే కాదు అంతర్జాతీయంగానూ పలు పదవులకు వన్నె తెచ్చారు. భారత ఆర్థికమంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంకుల బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తించారు.
 
మచ్చలేని రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు 2008లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 2019, ఆగస్టు 8వ తేదీన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది. 
 
ముఖ్యంగా గాంధీల కుటుంబానికి సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాదు, వారికి అన్ని విధాలా అండగా నిలిచారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతోను, ఆర్ఎస్ఎస్ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు నెరిపిన ఆజాతశత్రువు ప్రణబ్ దాదా.