బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (09:50 IST)

శివ నామస్మరణతో మార్మోగుతున్న శివక్షేత్రాలు... భక్తులతో కిటకిట

దేశవ్యాప్తంగా ఉన్న శివక్షేత్రాలు శివనామ స్మరణలో మార్మోగిపోతున్నాయి. ఫలితంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. సోమవారం తెల్లవారుజామునుంచే భక్తులు శివాలయాలకు క్యూకట్టి, మహాశివుడి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరి నిల్చున్నారు. 
 
ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా కృష్ణానది, గోదావరి నదులలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లా జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్న దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. 
 
సోమవారం ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తరపున రాజన్నకు  పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి మహా లింగార్చన జరుగనుంది. రాత్రి 11 గంటల తర్వాత లింగోద్భవ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 
అదేవిధంగా మహాపుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైలంలో వైభవోపేతంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. రాజమండ్రిలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. గోదావరి పుష్కరాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేస్తున్నారు.