శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (15:01 IST)

59 యాప్‌లపై భారత్ బ్యాన్ - ఇండియన్ వెబ్‌సైట్లపై డ్రాగన్ కంట్రీ నిషేధం

తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనా పాల్పడుతోన్న చర్యలకు ప్రతిగా చైనాకు చెందిన 59 మొబైల్‌ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ చర్యపై డ్రాగన్ కంట్రీ స్పదించింది. 
 
భారత్ చర్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రకటన చేశారు. యాప్‌లను నిషేధించిన విషయంలో అన్ని అంశాలను ధ్రువీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
 
'అంతర్జాతీయ, స్థానిక చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేయాలని మా దేశ వాణిజ్య, వర్తక సంస్థలకు చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చెబుతుంది. చైనా పెట్టుబడిదారులతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన నేపథ్యంలో... చైనా కూడా ఘాటుగానే ప్రతిస్పందించింది. చైనాలో భారత వెబ్ సైట్లు చూసేందుకు వీల్లేకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది. 
 
అటు, భారత టీవీ చానళ్లు చూడాలంటే ఐపీ టీవీ ఒక్కటే మార్గమని బీజింగ్‌లోని భారత దౌత్య వర్గాలంటున్నాయి. దీన్నిబట్టి అక్కడి కేబుల్ న్యూస్ వ్యవస్థలో భారత టీవీ చానళ్లను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.
 
చైనాలో వార్తా ప్రసారాలపైనా, ప్రసార సంస్థలపైనా విపరీతమైన సెన్సార్ ఉంటుంది. వీపీఎన్ వంటి నెట్వర్కింగ్ టూల్స్ లేకుండా వెబ్ సైట్లు వీక్షించడం కుదరనిపని. అందుకే చైనా తనకు అభ్యంతరకరం అని భావించిన వెబ్ సైట్లను, టీవీ చానళ్లను ఇంటర్నెట్లో చూసేందుకు వీల్లేకుండా వీపీఎన్‌ను నిలువరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఈ టెక్నాలజీ పనితీరు చూస్తే అద్భుతం అనకుండా ఉండలేరు.