శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (12:01 IST)

చైనా దూకుడు సరికాదు : భారత్‌కు అమెరికా మద్దతు

భారత సరిహద్దులతో పాటు జపాన్ ఆధీనంలో ఉండే సముద్ర జలాలపై చైనా చెలాయిస్తున్న ఆధిపత్యం, ప్రదర్శిస్తున్న దూకుడు ఏమాత్రం సరికాదని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. అదేసమయంలో గాల్వాన్ లోయలో చైనా సైనికుల తీరును అమెరికా సెనెటర్లు ముక్తకంఠంతో ఖండించారు. 
 
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌ - చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా నుంచి భారత్‌కు మద్దతు పెరుగుతోంది. చైనా చర్యలను పలు వేదికలపై అమెరికా చట్టసభ ప్రతినిధులు ఖండిస్తూ భారత్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా చైనా చర్యలు ఉన్నాయని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సంధూతో అమెరికాలోని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సీనియర్‌ సెనేటర్‌ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము భారత్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. చైనా చర్యలను తిప్పికొట్టే సమర్థత భారత్‌కు ఉందని ఇటీవల గాల్వన్ ఘర్షణ ద్వారా తేలిందని చెప్పారు.
 
ఇదేవిషయంపై సెనేట్‌లో మిచ్‌ మెక్‌కన్నెల్‌ మాట్లాడారు. ఇండియా విషయంలో చైనా దూకుడును కనబరుస్తోందని విమర్శించారు. సెనేటర్‌ టామ్‌ కాటన్ మాట్లాడుతూ.. భారత సరిహద్దులతో పాటు జపాన్‌ అధీనంలో ఉండే సముద్ర జలాలపై చైనా ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని చెప్పారు.