శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (12:57 IST)

గాల్వాన్ లోయకు 'ఘాతక్' కమాండోలను పంపిన భారత్

తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి బరితెగింపు చర్యలకు పాల్పడ్డాయి. వీటిపుణ్యమాని భారత్‍కు చెందిన 21 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన భారత్... చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో బలగాలను సరిహద్దులకు తరలిస్తోంది. అలాగే, ఆయుధ డిపోను కూడా గుట్టుచప్పుడుకాకుండా గాల్వాన్ లోయ సరిహద్దులకు తరలిస్తోంది. 
 
ఇదిలావుంటే, గాల్వాన్‌ లోయలో భారత సైనికులపై చైనా పీపుల్స్ ఆర్మీ దాడికి పాల్పడే ముందు రోజు, మార్షల్‌ ఆర్ట్స్ యోధులు, పర్వతారోహకులను పంపిందని వార్తలు వచ్చాయి. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. చైనాకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు వీలుగా కేంద్రం ప్రాణాంతక 'ఘాతక్'‌ కమాండోలను రంగంలోకి దింపింది. 
 
ఈ కమాండోలను కర్ణాటకలోని బెల్గాం పట్టణ శివారులో ఉన్న ఓ ప్రత్యేక శిబిరంలో తర్ఫీదు చేస్తారు. మెరికల్లాంటి సైనికులను ఎంపిక చేసుకుని, వారికి అత్యంత కఠిన శిక్షణ ఇస్తారు. 35 కిలోల వరకూ బరువును సునాయాసంగా ఎత్తడం, 40 కిలోమీటర్ల దూరం వరకూ ఆగకుండా నడవడంతో పాటు శారీరకంగానూ వీరు అత్యంత బలాఢ్యులుగా ఉంటారు. 
 
ప్రత్యేక ఆయుధాల శిక్షణ, పోరాట శిక్షణ వీరి సొంతం. ప్రతి ఒక్కరికీ మార్షల్స్ ఆర్ట్స్‌లో కూడా ప్రవేశం ఉంటుంది. చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా, ప్రాణాలకు తెగించి పోరాడటంలో దిట్టలు. వీరికి యుద్ధ విమానాలు నడపడంలోనూ శిక్షణ ఇస్తారు. శత్రువుల విమాన స్థావరాలు, మందుగుండు స్థావరాలు, డంపింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడికే వెళ్లి ప్రత్యక్ష దాడులు చేస్తారు. 
 
పలు రకాల యుద్ధకళల్లోనూ వీరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ఉండటంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా వెనుకంజ వేయరు. పర్వత ప్రాంతాలలో దాడులనూ చేయగల సమర్థులు. సాధారణంగా ఒక 'ఘాతక్' ప్లాటూన్‌‌లో 22 మంది కమాండోలు ఉంటారు.
 
ఒక కమాండింగ్ కెప్టెన్, ఇద్దరు నాన్ - కమిషన్డ్ ఆఫీసర్లు, మార్క్స్ మాన్, స్పాటర్ జోడీలు, లైట్ మెషిన్ గన్నర్స్, మెడిసిన్, రేడియో ఆపరేటర్ వంటి వారితో ఈ టీమ్ నిండివుంటుంది. వీరి వద్ద టార్-21, ఇన్సాస్, ఏకే-47 వంటి ఆయుధాలతో పాటు డ్రాగునోవ్ ఎస్వీడి రైఫిల్స్, హెక్లర్ క్లోచ్ వెపన్స్ ఉంటాయి. తాము చేపట్టబోయే ఆపరేషన్ కు అనుగుణంగా ఎటువంటి ఇతర పరికరాలనైనా వినియోగిస్తారు. గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లు, నైట్ విజన్ కెమెరాలను వాడటంలోనూ నేర్పుతో ఉంటారు.
 
ఇక ఒకసారి ఘాతక్ కమాండోలు దాడి చేస్తే, అది చాలా అనూహ్యంగా ఉంటుంది. శత్రువులు కోలుకునేందుకు కూడా సమయం ఉండదు. తాము ఎంచుకున్న యూనిట్ పై అకస్మాత్తుగా దాడి చేసి, పక్కవారి ప్రాణాలు తీసి, అనుకున్నది సాధించే వరకూ నిద్రపోరు. 
 
1996లో భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పరిధి వరకూ ఎటువంటి ఆయుధాలు వినియోగించేందుకు వీల్లేని పరిస్థితుల్లో ఘాతక్ కమాండోల అవసరం ఆ ప్రాంతంలో ఉందని భావించిన కేంద్రం, ఇప్పుడు వారిని అక్కడికి తరలించిందని తెలుస్తోంది.