1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Singapore to extend partial lockdown by four weeks until June 1

లాక్‌డౌన్‌ను పొడగించిన సింగపూర్.. ఎప్పటివరకంటే?

Singapore
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్ బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు లాక్‌డౌన్ను అమలు చేస్తున్నాయి. ఈ విధానాన్ని అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. తాజాగా సింగపూర్ కూడా మరికొన్ని రోజులు పాటు ఈ లాక్‌డౌన్‌ను పొడగించింది. అంటే.. జూన్ నెల ఒకటో తేదీ వరకు ఈ లాక్‌డౌన్ పొడగించింది. 
 
దీంతో అప్పటివరకు అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసి ఉంచుతారు. మే నాలుగో తేదీకి లాక్‌డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా మరో నాలుగువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని లీ లూంగ్ ప్రకటించారు. 
 
కాగా, సింగపూర్‌ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 9125 కేసులు నమోదు కాగా, వలస కార్మికుల ద్వారా కొత్తగా 1111 కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. 
 
ఆసియా దేశాలకు చెందిన కూలీలు ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. సింగపూర్‌ పరిశ్రమలు వీరిపైనే ఆధారపడ్డాయి. సింగపూర్‌లో ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
మరోవైపు, భారత్‌లో కూడా అమలవుతున్న లాక్‌డౌన్ను పొడగించాలా? లేదా అనే అంశంపై కూడా కేంద్ర మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం జరుగనుంది. 
 
పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్న రాజ్ నాథ్ సింగ్, ఆపై సమావేశం వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి చేరవేయనున్నారు. లాక్డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
 
కాగా, లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు ఉండే అవకాశాలు లేవని, అయితే, రెడ్ జోన్లను మినహాయిస్తూ, మిగతా ప్రాంతాల్లో నిబంధనలను సడలించవచ్చనే వార్తలు వస్తున్నాయి. 
 
అదేసమయంలో ప్రజల మధ్య సామాజిక దూరం, మాస్క్‌లను తప్పనిసరి చేయడం వంటి నియమాలతో లాక్డౌన్ సడలింపు ఉంటుందని కేంద్ర వర్గాలు అంటున్నాయి. ఇదేసమయంలో రెడ్ జోన్లలో మరింత కఠినంగా ఉండేలా నిబంధనలను మార్చాలని, కంటైన్మెంట్ జోన్లపై తీసుకోవాల్సిన చర్యలపైనా వీరి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రజల ఆరోగ్యం గాలికొదిలేసి, విమర్శలా?: బిజెపి