1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. United Nations requested America

అమెరికాకు ఐక్యరాజ్యసమితి హితవు

United Nations
జాతి వివక్షకు ముగింపు పలికేందుకు తక్షణం నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావాలని జాతివివక్షను పారద్రోలడంపై ఐరాస నియమించిన కమిటీ అమెరికాను కోరింది.

ఈ వివక్ష మహమ్మారిని పరిష్కరించేందుకు అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐరాస కమిటీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1994లో అమెరికా ఆమోదించిన అన్ని రకాల జాతివివక్షల తొలగింపుపై అంతర్జాతీయ సదస్సును పూర్తిగా గౌరవించాలని, ఈ సదస్సుపై పోలీసులకు, ఇతర అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని పేర్కొంది.

ఈ కమిటీలో పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే 18 మంది నిపుణులు ఉన్నారు. వీరు ఇటీవల అమెరికాలోని మినియాపొలిస్‌ నగరంలో పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జి ఫ్లాయిడ్‌ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా పోలీసులు, ఇతర వ్యక్తుల చేతుల్లో హత్యకు గురవుతున్న ఆఫ్రికన్‌ అమెరికన్ల స్థితికి ఇది కొనసాగింపు అని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంలో నిర్మాణాత్మ్క రూపంలో జాతివివక్ష వేళ్లూనుకుపోయిందన్న విషయాన్ని ట్రంప్‌ సర్కార్‌ బహిరంగంగా ఒప్పుకోవాలని కోరింది. దీంతో పాటుగా వివక్ష ప్రేరణతో జరుగుతున్న ఆఫ్రికన్‌ అమెరికన్లు, ఇతర మైనార్టీల హత్యలను భేషరుతుగా ఖండించాలని పేర్కొంది.

' వందలాది సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థల్లో వ్యవస్థాపూర్వక, నిర్మాణాత్మక రూపంలో వివక్ష వ్యాపించింది. సమానత్వం కోసం ఆఫ్రికన్‌ అమెరికన్లు ట్రిబ్యునల్స్‌లను కూడా ఆశ్రయించే హక్కులను తొలగించింది.

వ్యక్తిగత భద్రతకు ముప్పు ఏర్పడడంతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన హక్కులకు దూరం చేసింది' అని కమిటీ చైర్‌పర్సన్‌ నౌరేద్దినే అమిర్‌ పేర్కొన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
భారత్ - చైనా ఉద్రిక్తతలు: 20 మంది భారత సైనికులు వీరమరణం