గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (09:31 IST)

3 సెకన్లలో 2 గంటల సినిమా డౌన్‌లోడ్‌.. ఇదీ 5జీ నెట్ స్పీడ్

దేశంలోని టెలికాం కంపెనీలు ఇంటర్నెట్ సేవలను అత్యంత వేగంగా అందించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. భారత్‌లో తొలిసారి 5జీ సేవలను ఎరిక్‌సన్ సంస్థ పరిచయం చేసింది. ఈ రేడియో తరంగాలు ఏం చేయగలవో తొలిసారి లైవ్ చేసి చూప

దేశంలోని టెలికాం కంపెనీలు ఇంటర్నెట్ సేవలను అత్యంత వేగంగా అందించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. భారత్‌లో తొలిసారి 5జీ సేవలను ఎరిక్‌సన్ సంస్థ పరిచయం చేసింది. ఈ రేడియో తరంగాలు ఏం చేయగలవో తొలిసారి లైవ్ చేసి చూపించింది. 3 మిల్లీ సెకన్లు... అంటే కనీసం రెప్పపాటు సమయం కూడా కాదు. అంత తక్కువ సమయంలో ఏం చేస్తాం? 5వ తరం రేడియో తరంగాలు ఏం చేయగలవో ఇండియాలో తొలిసారిగా లైవ్ చూపించింది ఎరిక్ సన్ సంస్థ. 
 
తమ 5జీ టెస్ట్ బెడ్‌పై సెకనులో 3వ వంతు కన్నా తక్కువ సమయంలో 5.7 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను చూపి ఓ అద్భుతాన్ని కళ్లముందు చూపింది. భారత మార్కెట్లో 2026 నాటికి 5జీ సాంకేతికత 27.3 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసేంత స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు ఎరిక్‌సన్ సంస్థ పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో 5జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం నోకియా దేశీయంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌తోనూ, ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌తోనూ జట్టుకట్టింది. అలాగే, భారతి ఎయిర్‌టెల్‌తో స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్ 5జీ టెక్నాలజీపై ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే  బెంగళూరులో 5జీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసిన నోకియా.. కొత్త తరం టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తెచ్చే అంశాలపై దృష్టి పెడుతోంది. 
 
5జీ టెక్నాలజీలో సెకనుకు 10 గిగాబిట్స్‌కు పైగా డేటా స్పీడ్‌ ఉంటుంది. 3 సెకండ్లలోనే 2 గంటల సినిమా డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయంతో పాటు, ఐవోటీకి అనువైన టెక్నాలజీ దీని ప్రత్యేకత. 5జీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను 2019లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోగానే వెరిజోన్, కొరియా టెలికాం, చైనా టెలికాం, ఎన్‌టీటీ డొకొమో, వొడాఫోన్, ఎరిక్సన్, శాంసంగ్, స్ప్రింట్‌ మొదలైన దిగ్గజ టెల్కోలు ఈ నెట్‌వర్క్‌కు మళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
దక్షిణ కొరియాలోని ప్యోంగ్‌చాంగ్‌లో వచ్చే ఏడాది జరగబోయే వింటర్‌ ఒలింపిక్స్‌లో 5జీ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అక్కడి మొబైల్‌ ఆపరేటర్‌ కేటీ సన్నాహాలు చేస్తోంది. చైనాలోని టెల్కోలు 2020 నాటికల్లా 5జీ టెక్నాలజీకి సంబంధించి వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 నాటికల్లా ప్రపంచంలోనే అతి పెద్ద 5జీ మార్కెట్‌గా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. 
 
అటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా కూడా 2020 వరకు 5జీని ప్రవేశపెట్టే అవకాశముంది. పొరుగున ఉన్న పాకిస్తాన్‌ కూడా త్వరలోనే 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టబోతున్నామంటూ కొనాళ్ల క్రితమే ప్రకటించింది. అలాగే, భారత్‌లో కూడా ఈ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా ప్రైవేట్ టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇందులోభాగంగా, ఇటీవల 5జీ తరంగాల లైవ్ జరిగింది.