శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: గురువారం, 7 మే 2020 (19:08 IST)

క్షుద్ర పూజలు చేస్తున్నారని ముగ్గురు మహిళలకు గుండు కొట్టించి, ఆపై?

క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహంతో ముగ్గురు మహిళలను గుండు కొట్టించి అర్థనగ్నంగా ఊరేగించారు. ఈ దారుణం మే 4వ తేదీ సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ముజఫర్పూర్ జిల్లాలోని హతౌది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దక్రామా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒక చోట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
అది తెలిసిన గ్రామస్థులు వారిపై మంత్రపూజలు చేస్తున్నారని నిందను మోపి దారుణంగా ప్రవర్తించారు. వారికి గుండు కొట్టించి అర్థనగ్నంగా ఊరేగించారు. బలవంతంగా మూత్రం కూడా త్రాగించే ప్రయత్నాలు చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ముజఫర్పూర్ పోలీసులు తెలిపారు. 
 
మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు శ్యామ్ సహానితో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.