1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (18:42 IST)

ఎవరీ బిపిన్ రావత్? - ఆయన నేపథ్యం ఏంటి?

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని భారత వాయు సేనతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, భారత త్రివిధ తొలి దళాధిపతిగా నియమితులైన బిపిన్ రావత్.. 1958లో మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిందూ గర్వాలీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబం తరతరాలుగా సైన్యంలో సేవలు అందిస్తుంది. బిపిన్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీల్ లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేశారు. ఆయన తల్లి ఉత్తర కాశీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె. 
 
బిపిన్ రావత్ డెహ్రాడూన్‌లోని కాంబ్రియన్ హాల్, సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, ఇండియన్ మిలిటరీ అకాడెమీ, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో చదువుకున్నారు. 
 
ఇండియన్ మిలిటరీ అకాడెమీలో ఆయన ప్రతిభకు స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డు కూడా లభించింది. అమెరికాలోని కాన్సాస్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హైయర్ కమాండ్ కోర్సును కూడా చేశారు. 
 
జమ్మూకాశ్మీర్‌లోని ఉరీలో మేజర్ హోదాలో పని చేశారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి ఆయన 2016 డిసెంబరు 17వ తేదీన ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపికయ్యారు. ఇద్దరు సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవిని దక్కించుకున్నారు. 
 
గోర్ఖా బ్రిగేడ్ నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎదిగి ముగ్గురు అధికారుల్లో రావత్ ఒకరు. అలాగే, నేపాల్‌ ఆర్మీకి గౌరవాధ్యక్షుడుగా కూడా పనిచేశారు. ఆర్మీ చీఫ్ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత 2019 జనవరిలో ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన భారత త్రివిధ దళాధిపతి బాధ్యతలను తొలిసారి స్వీకరించారు. 
 
ఈయన ఆ బాధ్యతల నుంచి వచ్చే యేడాది పదవీ తప్పుకోవాల్సివుంది. కానీ, ఇంతలోనే బుధవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయనతో పాటు.. ఆయన భార్య మధులికా రావత్‌ దుర్మరణం పాలయ్యారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ సంతాపాలను తెలిపారు.