గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:32 IST)

వలస కార్మికుల వల్లే కరోనా కేసులు: రాజ్‌థాకరే

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధినేత రాజ్‌ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణం ఇతర రాష్ట్రాలకు చెందిన వలసకార్మికులేనంటూ నోరు జారారు.

వలస కార్మికులు వస్తున్న రాష్ట్రాల్లో... కరోనా పరీక్షలు చేయడానికి తగిన సదుపాయాలు లేవని ఆరోపించారు. దేశంలోనే అత్యంత పారిశ్రామికీకరణ గల రాష్ట్రం ఇదేనని, అందుకే పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు ఇక్కడకు వస్తున్నారని, కార్మికులు వచ్చే ప్రాంతాల్లో తగినంత పరీక్షలు చేపట్టే సౌలభ్యాలు లేవని అన్నారు.

గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులకు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించామని, కానీ అది జరగలేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేతో సమావేశానంతరం రాజ్‌ థాకరే వ్యాఖ్యానించారు.

భౌతిక దూరం వంటి నిబంధనలతో ప్రాక్టీస్‌ చేసుకునేందుకు క్రీడాకారులకు, జిమ్‌లకు అనుమతినివ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. మహారాష్ట్రలో సోమవారం నుండి అమలు చేసిన నిబంధనల పట్ల మాట్లాడుతూ...ఈ సమయంలో రెండు, మూడు సార్లు అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతినిస్తే బాగుండేదని అభిప్రాయ పడ్డారు.

కేవలం తయారీ సంస్థలకు అనుమతినిచ్చి... దుకాణాలు తెరవకపోతే లాభమేమిటని ప్రశ్నించారు. కాగా, ఏప్రిల్‌ 30 వరకు అత్యవసర, మెడికల్‌ దుకాణాలు తప్ప అన్నింటిని మూసివేస్తున్నట్లు ఉద్ధవ్‌ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.