శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (21:04 IST)

జూన్ 14 తర్వాత అన్‌లాక్ ప్రక్రియ.. ఏయే రాష్ట్రాల్లో తెలుసా?

జూన్ 14 తర్వాత అన్‌లాక్ ప్రక్రియ కొనసాగే అవకాశం వుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సోమవారం నుంచి ఆంక్షలను సడలించారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, గుజరాత్‌ ప్రభుత్వాలూ కొన్ని మినహాయింపులిచ్చాయి. దీంతో అనేక ప్రాంతాల్లో షాపులు, రెస్టారెంట్లు, మార్కెట్లు, ఆఫీసులు తెరుచుకున్నాయి. బస్సులు, మెట్రో రైళ్లు మొదలయ్యాయి.
 
దాదాపు నెలన్నర తర్వాత ఢిల్లీలో అన్‌లాక్‌ మొదలైంది. జూన్‌ 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం.. సరి, బేసి పద్ధతిలో సడలింపులివ్వడంతో సోమవారం మార్కెట్లు, షాపులు తెరుచుకున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు వీటికి అనుమతిచ్చారు. 
 
మూడు వారాలుగా షట్‌డౌన్‌లో ఉన్న మెట్రో రైళ్లు కూడా మొదలయ్యాయి. ప్రైవేటు ఆఫీసులు కూడా 50 శాతం కెపాసిటీతో  తెరుచుకున్నాయి. స్పాలు, జిమ్ లు, ఎంటర్‌టైన్మెంట్‌ జోన్లు, పార్కులకు ఢిల్లీ సర్కారు అనుమతి ఇవ్వలేదు. సడలింపుల వల్ల జనం బయటకు రావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో కేసులు తగ్గిపోయాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వైరస్‌ తీవ్రతను బట్టి 5 ఫేజ్‌లలో సడలింపులిచ్చింది. 
 
తమిళనాడులో జూన్‌  14 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. అయితే కేసులు తక్కువున్న జిల్లాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో4 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను అక్కడి సర్కారు సడలించింది. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను జూన్‌ 20 వరకు ప్రభుత్వం పొడిగించింది. అయితే కర్ఫ్యూ వేళల్లో 2 గంటలు సడలింపులిచ్చింది.