నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్ వినియోగం..?
ఛత్తీస్గఢ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేతకు అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలను కేంద్ర బలగాలు వాడినట్టు మావోయిస్టులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు నుంచి బయటపడిన ఓ మావోయిస్టు అగ్రనేత 'ఫినిక్స్' పేరుతో రాసిన ఓ రిపోర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
గతేడాది ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా కుల్హ దీఘాట్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ డీఆర్, ఒడిశా ఎస్వోజీ, సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. సుమారు 48 గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి సహా 16 మంది మావోయిస్టులు మరణించారు.
ఈ ఎన్కౌంటర్ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టు నేత, పార్టీకి పంపిన నివేదికలో సంచలన విషయాలు పేర్కొన్నారు. బలగాలు తమపై తీవ్రమైన షెల్లింగ్కు పాల్పడ్డాయని, ఆ ముక్కలు తగిలిన సహచరులు కేవలం గాయాలతోనే కాకుండా భరించలేని మంట, నొప్పితో విలవిల్లాడారని తెలిపారు. తీవ్రమైన దాహం, వాంతులతో నరకయాతన అనుభవించారని ఆ రిపోర్టులో వివరించారు.
గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్న ఈ నివేదికను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.