1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. maoists allegation security forces used poison shells in encounter

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

Naxals
ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేతకు అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలను కేంద్ర బలగాలు వాడినట్టు మావోయిస్టులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు నుంచి బయటపడిన ఓ మావోయిస్టు అగ్రనేత 'ఫినిక్స్' పేరుతో రాసిన ఓ రిపోర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
 
గతేడాది ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా కుల్హ దీఘాట్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ డీఆర్, ఒడిశా ఎస్‌వోజీ, సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. సుమారు 48 గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి సహా 16 మంది మావోయిస్టులు మరణించారు.
 
ఈ ఎన్‌కౌంటర్ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టు నేత, పార్టీకి పంపిన నివేదికలో సంచలన విషయాలు పేర్కొన్నారు. బలగాలు తమపై తీవ్రమైన షెల్లింగ్‌కు పాల్పడ్డాయని, ఆ ముక్కలు తగిలిన సహచరులు కేవలం గాయాలతోనే కాకుండా భరించలేని మంట, నొప్పితో విలవిల్లాడారని తెలిపారు. తీవ్రమైన దాహం, వాంతులతో నరకయాతన అనుభవించారని ఆ రిపోర్టులో వివరించారు.
 
గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్న ఈ నివేదికను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
తర్వాతి కథనం
పెళ్లయ్యాక భర్తతో విడిపోతావన్న జ్యోతిష్యుడు.. ఉరేసుకున్న టెక్కీ.. ఎక్కడ?